గ్రామదేవతల పూజలకు ఉద్దేశించినది, తెలంగాణ జానపదుల సాంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. ఆషాఢం వచ్చిందంటే, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో జాతరల సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తాయి.
ఋతువులు మారి, ఆషాఢంలో వర్షాలు కురిసి, వాతావరణ మార్పులతో, కలరా, ప్లేగు లాంటి మహమ్మారులు సంక్రమించే క్రమంలో, వైద్య సౌకర్యాలు లేని స్థితిలో, దేవతలను కొలవడం ప్రాచీన కాలంలో జరిగేది. 1813లో భాగ్యనగరంలో వేలాది మంది ప్లేగు వ్యాధికి గురైన సందర్భంలో, మహంకాళిని కొలవడం వల్ల వ్యాధి తగ్గుముఖం పట్టిందని, అప్పటి నుండి రాష్ట్ర రాజధానిలోనూ బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు వాడుక. గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో, అబుల్ హసన్ తానీషా పాలనా సమయంలో అధికారులుగా ఉన్న అక్కన్న, మాదన్నల కాలంలో ఉత్సవాలు ప్రారంభమైనట్లు కథనాలున్నాయి. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు, నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మంత్రి కిషన్ప్రసాద్ను ఏమి చేయాలని సలహా కోరగా అమ్మవారికి పూజలు చేయాలని ప్రభువుకు వివరించారు. దీంతో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్ర్తాలు సమర్పించి పూజలు నిర్వహించిన ఫలితంగా వరదలు తగ్గుముఖం పట్టాయని చెబుతారు. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు చేత విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 7వ నిజాం కాలం నుండి సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నివేదనలే బోనాలు. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ఆంకాలమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నాయకమ్మ మొదలైన పేర్లతో పిలిచే దేవతల గుళ్ళను దేదీప్య మానంగా అలంకరిస్తారు. పాలు, పెరుగు, బెల్లం, కొన్ని చోట్ల ఉల్లిపాయలతో కలిపిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలో తీసుకొస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని గ్రామీణుల విశ్వాసం. పండుగ సందర్భంగా కొందరికి పూనకం (అమ్మవారు ఆవహిస్తారు) రాగా, వారిని శాంతింప చేసేందుకు ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్ళు కుమ్మరిస్తారు.
అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక బలిష్టకాయుడు కాళ్లకు గజ్జెలు కలిగి వాద్య ధ్వనులకు అనుగుణంగా నర్తిస్తాడు. మేకపోతును అందించగా పోతరాజు మేక తల మొండెం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. గత ఏడాది కరోనా వల్ల ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహించారు.
ఈసారి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రతి గురు, ఆదివారం పూజలు జరుగుతాయి. 11న గోల్కొండలో మొదటి పూజ పూర్తవగా.. 15న రెండో పూజ, 18న మూడో పూజ, 22న నాలుగో పూజ, 25న 5వ పూజ, 29న 6వ పూజ, ఆగస్టు 1న 7వ పూజ, 5న 8వ పూజ, 8న 9వ పూజతో గోల్కొండ బోనాలు ముగుస్తాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.
రామకిష్టయ్య సంగనభట్ల