Ganguly, Virat Kohli : ప్రత్యర్థికి నిద్రలేకుండా చేసే పదునైన పేస్ దళం.. యువకులతో కూడిన దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్.. మెరుపు వేగంతో స్పందించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఫీల్డింగ్.. ఇదీ టీమిండియా. దానికి తోడు దూకుడుగా కనిపించే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఇంకేం.. అపోజిషన్ వణకాల్సిందే. కాదూ, కూడదు.. రెచ్చిపోతాం అంటే అసలుకే ఎసరుపెట్టి ఏకిపారేస్తారు. అవును! ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పుడదే చేస్తోంది. తొలి టెస్టునే గెలవాల్సి ఉన్నా వర్షం కారణంగా డ్రా అయ్యింది. కానీ, రెండో టెస్టులో భారత క్రికెటర్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఇంగ్లండ్ క్రికెటర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. క్రికెట్ మక్కాగా పిలుచుకొనే లార్డ్స్ మైదానంలో వాళ్లకు కండ్లు బయర్లు కమ్మేలా చేయటం. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి సందర్భమే లార్డ్స్ గ్రౌండ్లో చోటుచేసుకుంది. అదేనండోయ్.. గంగూలీ షర్ట్ విప్పిన సంఘటన. ప్రస్తుతం విరాట్ కోహ్లీ షర్ట్ విప్పకపోయినా, గ్రౌండ్లో చేయాల్సిన హల్చల్ చేసేశాడు.
అసలేమైంది? కోహ్లీ సేన అంతలా దూకుడు పెంచటానికి కారణమేంటి?
‘ఈ 60 ఓవర్లు వాళ్లకు క్రీజులో నరకం కనిపించాలి’ బరిలో దిగే ముందు కెప్టెన్ కోహ్లీ.. జట్టు సభ్యులకు చెప్పిన మాటలివి. దీన్ని బట్టి మనవాళ్లు లార్డ్స్ లో ఎంత కసిగా పోరాడారో అర్థం చేసుకోవచ్చు. అసలేం జరిగిందంటే.. లార్డ్స్ టెస్టు చివరి రోజు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బౌలర్లను విసిగించారు. అచ్చమైన టెస్టు ఆటగాళ్లను తలపిస్తూ ఇంగ్లిష్ బౌలర్లను ఆటాడుకున్నారు. 20 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జంట 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించింది. దీంతో చిర్రెత్తుకుపోయిన ఇంగ్లండ్ బౌలర్లు తమ నోటికి పనిచెప్పారు. బుమ్రాను లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగడంతో పాటు.. అతడి శరీరంపైకి బంతులు ఎక్కుపెట్టి పదే పదే షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బందిపెట్టాలని ప్రయత్నించారు. ఈ కసినంతా కోహ్లీ మనసులో పెట్టుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆఖరు బ్యాట్స్ మన్ అండర్సన్ను త్వరగా ఔట్ చేసేందుకు బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చుక్కలు చూపించాడు. కోపంతో రగిలిపోయిన అండర్సన్..నేను నీకు అంత వేగంగా బంతులు వేశానా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిశాక బుమ్రా అండర్సన్ భుజం తట్టి ఉద్దేశపూర్వకంగా బంతులు వేయలేదని చెప్పబోయాడు. కానీ, బుమ్రాను అండర్సన్ పక్కకు తోసేసి, బూతులు తిట్టాడు. ఆ ఘటన టీమిండియా శిబిరంలో, కోహ్లీలో పట్టుదలను పెంచింది.
ప్రతి వికెట్కు పండుగ చేసుకున్న కోహ్లీ..
కెప్టెన్ అంటే గ్రౌండ్లో సంయమనం పాటించాలి. కానీ ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ పడ్డ ప్రతీసారి కోహ్లీ పండుగ చేసుకున్నాడు. వికెట్ పడగానే పిడికిలి బిగించి బిగ్గరగా అరుస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాడు. అటు.. మిగతా భారత ఆటగాళ్లు కూడా తామేం తక్కువ అన్నట్టు సంబురాలు చేసుకున్నారు. బుమ్రాను తిట్టినందుకు ఇంగ్లండ్కు గుణపాఠం నేర్పించాలన్న కసి కోహ్లీలో కనిపించింది. అనుకున్నట్టుగానే బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్ తమ పవర్ చూపించారు. క్రీజులో నిలదొక్కుకోవటానికే ఆపసోపాలు పడేలా ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ను ముప్పుతిప్పలు పెట్టారు.
ఆనాడు గంగూలీ కూడా ఇలాగే..
2002, జూలై 13న జరిగిన నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆ విజయాన్ని లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి సౌరభ్ గంగూలీ సెలబ్రేట్ చేసుకోవడం, ఇప్పటికీ ప్రతీ క్రికెట్ ఫ్యాన్కు గుర్తుండిపోతుంది. అంతకుముందు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్.. ముంబై మ్యచ్లో ఆఖరి వికెట్గా వచ్చిన జవగల్ శ్రీనాథ్ను తొలి బంతికే బౌల్డ్ చేసిన ఫ్లింటాప్… చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు.. దాన్ని గుర్తుపెట్టుకున్న గంగూలీ బదులు తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశాడు. నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో గెలవగానే గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు.
అచ్చొచ్చిన లార్డ్స్..
లార్డ్స్ లో గెలవటం ఏ జట్టుకైనా ప్రత్యేకమే. క్రికెట్ పుట్టిన లార్డ్స్ గడ్డపై, క్రికెట్ నేర్పించిన ఇంగ్లండ్ దేశంపై గెలవటం అంటే అదో మధురానుభూతి. అందుకే, లార్డ్స్ లో ఆడే ప్రతీ ప్రత్యర్థి జట్టు గెలవడానికి ఎదురుచూస్తుంది. అలాంటి మధురానుభూతులను లార్డ్స్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ను అందించిందనే చెప్పాలి. నాడు గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నది, కోహ్లీ కసిగా విజయనాదం పూరించింది.. లార్డ్స్ లోనే.