దుబాయ్: ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా జట్టును స్టీవ్ స్మిత్ (57), గ్లెన్ మ్యాక్స్వెల్ (37), మార్కస్ స్టొయినిస్ (45) ఆదుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టుకు ఘోరమైన ఆరంభం లభించింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టు నడ్డివిరిచాడు. డేవిడ్ వార్నర్ (1), మిషెల్ మార్ష్ (0) వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ ఫించ్ (8)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఆ సమయంలో స్మిత్, మ్యాక్స్వెల్ జోడీ జట్టను ఆదుకుంది. వీరిద్దరూ కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత మ్యాక్స్వెల్ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. చివర్లో స్టొయినిస్ చెలరేగి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, సిక్సర్తో 45 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో స్మిత్ అవుట్ అయ్యాడు.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. భువనేశ్వర్, రాహుల్ చాహర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.