దుబాయ్: వార్మప్ మ్యాచ్లో మరోసారి టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆసీస్పై మరో 12 బంతులు మిగిలుండగానే గెలిచింది. 153 పరుగుల లక్ష్యఛేదనలో భారత్కు కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (60 రిటైర్ట్ అవుట్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (38 నాటౌట్) కూడా చాలా రోజుల తర్వాత రాణించాడు.
చివర్లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (14) సిక్సర్తో మ్యాచ్ ముగించాడు. దీంతో భారత జట్టు 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు భారత స్పిన్నర్లు చెమటలు పట్టించారు.
అశ్విన్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్కు గట్టి షాకిచ్చాడు. ఆ తర్వాతా జడేజా, రాహుల్ చాహర్ కూడా చెరో వికెట్తో ఆసీస్ను ఇబ్బంది పెట్టారు. స్టీవ్ స్మిత్ (57), మ్యాక్స్వెల్ (37), స్టొయినిస్ (41) రాణించడంతో ఆస్ట్రేలియా పోరాడే స్కోరు చేయగలిగింది.
ఈ మ్యాచ్ విజయంతో ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించినట్లయింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా ఇదే రీతిలో అద్భుత విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్టన్ అగర్ ఒక వికెట్ పడగొట్టాడు.