న్యూఢిల్లీ : డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2-డీజీ జూన్ తొలివారంలో దేశవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉంటుందని డీఆర్డీఓ చైర్మన్ జీ సతీష్ రెడ్డి వెల్లడించారు. తొలి బ్యాచ్ డ్రగ్ లాంఛనంగా సోమవారం ప్రారంభం కాగా ప్రస్తుతం ఎయిమ్స్, సాయుధ దళాల ఆస్పత్రులు, డీఆర్డీఓ ఆస్పత్రులతో పాటు అవసరమైన ఆస్పత్రుల్లో వాడతారని చెప్పారు. జూన్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో 2-డీజీ మందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఔషధం ఉత్పత్తి సాగుతోందని మే చివరివారంలో రెండో బ్యాచ్ సిద్ధమవుతుందని అన్నారు. జూన్ తొలి వారం నుంచి రెగ్యులర్ ప్రొడక్షన్ ఊపందుకుంటుందని వెల్లడించారు.
డీసీజీఐ నుంచి డ్రగ్ కు అనుమతి లభించినప్పటి నుంచి పరిశ్రమ సహకారంతో ఉత్పత్తిని పెంచేందుకు శ్రమించినా సాధారణ ఉత్పత్తి సామర్థ్యం చేరుకునేందుకు నెలరోజుల సమయం పడుతుందని చెప్పారు. 2-డీజీ మందు పనితీరును వివరిస్తూ శరీరంలో కొవిడ్-19 వైరస్ దాగిన కణాల్లోకి నేరుగా ఈ మందు వెళ్లి వైరస్ వ్యాప్తిని ఇతర ఆరోగ్యంగా ఉన్న కణాల్లోకి చేరకుండా నిరోధిస్తుందని చెప్పారు. రోగిలో వ్యాధి నిరోధక శక్తిపై కూడా ఈ మందు పనిచేయడంతో రోగి త్వరగా కోలుకునేందుకు ఉపకరిస్తుందని వివరించారు.