న్యూఢిల్లీ: విదేశీ అత్యుత్తమ కోచ్లు, స్వదేశీ కోచ్ల కలయికతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ద్వితీయ శ్రేణి విదేశీ కోచ్ల వల్ల అత్యుత్తమ ప్లేయర్లను తయారు చేయలేమని పేర్కొన్నాడు. హై పర్ఫార్మెన్స్ కోచ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో గురువారం జరిగిన భేటీలో పాల్గొన్న గోపీచంద్ మాట్లాడుతూ ‘ప్లేయర్లను తీర్చిదిద్దే విషయంలో విదేశీ కోచ్ల పాత్ర చాలాకీలకం. కానీ అన్ని క్రీడల్లో వారి ప్రాతినిధ్యమే కాకుండా దేశీయ కోచ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుంది. మన కోచింగ్ పద్ధతిలో విదేశీ కోచ్లను సలహాదారులుగా నియమించుకుంటూ భారతీయులు నాయకత్వం వహిస్తే బాగుంటుంది. దీని వల్ల వారి నుంచి మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. భారత్ గెలువాలని స్వదేశీ కోచ్ ఎప్పుడూ కోరుకుంటాడు. అందుకనే మాజీ ప్లేయర్లను కోచ్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోచ్లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ , అధికారాలు కల్పిస్తే మరింత మందిని వెలుగులోకి తీసుకొస్తారు’అని అన్నారు.