ముంబై: ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ పదవిపై మరోసారి చర్చ మొదలైంది. టీమిండియా సీనియర్ టీమ్ ఇంగ్లండ్ టూర్లో ఉండగానే మరో టీమ్ను రెడీ చేసి బీసీసీఐ శ్రీలంకకు పంపించడం, దానికి రాహుల్ ద్రవిడ్ను కోచ్గా నియమించడంతో ఈ చర్చకు తెరలేపినట్లయింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్కప్తో ముగియనుంది. దీంతో అతని తర్వాత కోచ్ రేసులో ద్రవిడ్ ఉన్నాడని బీసీసీఐ ఇలా చెప్పకనే చెప్పిందన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే టీమిండియా వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఈ శ్రీలంక సిరీస్ అయితే పూర్తి కానివ్వండి. మన టీమ్ ప్రదర్శన ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఒకవేళ కొత్త కోచ్ను తయారు చేస్తుంటే అందులో తప్పేమీ లేదు. అయితే ఒకవేళ రవిశాస్త్రి తన మంచి పనితీరు కొనసాగిస్తుంటే.. అతన్ని తొలగించాల్సిన అవసరం కూడా లేదు. సమయమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ చర్చ ప్లేయర్స్, కోచ్లపై అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుంది అని కపిల్ దేవ్ అన్నాడు.
ఇక ఇండియా బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుందని అతను అభిప్రాయపడ్డాడు. రెండు వేర్వేరు టీమ్స్ను పంపించేంత అవకాశం బీసీసీఐకి కలిగిందంటేనే ఎంత మంది ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ రెండు టీమ్స్ ఇంగ్లండ్, శ్రీలంకల్లో విజయాలు సాధిస్తే.. అంతకన్నా మంచి విషయం మరొకటి ఉండదు అని కపిల్ అన్నాడు.