దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా మరో 10 మంది లెజెండరీ ప్లేయర్స్ను హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ప్లేయర్స్కు ఈ గౌరవం కల్పించనున్నారు. క్రికెట్ తొలినాళ్ల నాటి ప్లేయర్స్కు కూడా ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్లో 93 మంది ప్లేయర్స్ ఉన్నారు. జూన్ 18న సౌథాంప్టన్లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్తో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని గురువారం ఐసీసీ ప్రకటించింది. క్రికెట్కు తమ వంతు సేవలు అందించిన 10 మంది లెజెండ్స్కు అవకాశం కల్పిస్తామని చెప్పింది.
క్రికెట్ చరిత్రను మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దీనికి కొంతమంది గ్రేట్ ప్లేయర్స్ను గౌరవించుకోవడం కంటే మెరుగైన మార్గం ఇంకేముంటుంది. ఈ ప్లేయర్స్ భవిష్యత్తులో ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ అన్నారు. క్రికెట్ను ఐదు శకాలుగా విభజించారు. ప్రారంభ క్రికెట్ శకం (1918 కంటే ముందు), ఇంటర్ వార్ క్రికెట్ శకం (1918-1945), యుద్ధం తర్వాత క్రికెట్ శకం (1946-1970), వన్డే శకం (1971-1995), ఆధునిక క్రికెట్ శకం (1996-2016)గా విభజించి.. ఒక్కో శకం నుంచి ఇద్దరేసి ప్లేయర్స్ను హాల్ ఆఫ్ ఫేమ్కు ఎంపిక చేయనున్నారు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, హాల్ ఆఫ్ ఫేమ్లోని ఇప్పటికీ జీవించి ఉన్న సభ్యులు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జర్నలిస్టులు, సీనియర్ ఐసీసీ సభ్యులు ఇప్పటికే ఈ పది మంది ప్లేయర్స్ కోసం ఓటేశారు. ఐసీసీ డిజిటల్ మీడియా చానెళ్ల ద్వారా లైవ్లో సభ్యుల పేర్లను ప్రకటించనున్నారు. జూన్ 13న ఈ కార్యక్రమం జరగనుంది.