బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించిన ఐసీసీ
న్యూఢిల్లీ: స్వదేశంలో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 28 వరకు గడువిచ్చింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో అక్టోబర్-నవంబర్ మధ్య జరుగాల్సిన మెగాటోర్నీని భారత్లో నిర్వహించాలా లేక వేరే వేదికకు తరలించాలా అని బీసీసీఐ యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు నెల రోజులు గడువు కోరగా.. అందుకు ఐసీసీ అంగీకరించింది.
మరో నాలుగు డబ్ల్యూటీసీ ఎడిషన్లు..
ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ను ఇకముందు కూడా కొనసాగించాలని భావిస్తున్నది. 2023-31 మధ్య మరో నాలుగు ఫైనల్స్ నిర్వహించాలని యోచిస్తున్నది. సుదీర్ఘ ఫార్మాట్కు ప్రజాదరణ తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే వెల్లడించారు.