న్యూఢిల్లీ: మయన్మార్ మిలటరీకి చెందిన మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్తో అదానీ గ్రూప్ డీల్ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మిలటరీ.. దానిని నిరసిస్తున్న సాధారణ ప్రజలపై ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్కు అక్కడి మిలిటరీ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ భూమి లీజు కోసం మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్కు అదానీ గ్రూప్ 3 కోట్ల డాలర్లు చెల్లిస్తున్నట్లు యాంగూన్ రీజియన్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ నుంచి లీకైన పత్రాలు వెల్లడించాయి.
అయితే పోర్ట్ అనుమతి కోసం తాము మిలిటరీ అధికారులతో సంప్రదిస్తున్నామన్న వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. కానీ 2019, జులైలో అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ.. ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హాయింగ్ను కలిసినట్లు ఇప్పుడు బయటపడిన వీడియోలు, ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్తోపాటు మయన్మార్ ఎకనమిక్ హోల్డింగ్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్పై ఈ నెల 15న అమెరికా ఆంక్షలు కూడా విధించింది. మయన్మార్ మిలిటరీ వ్యాపార ప్రయోజనాలను దెబ్బ కొట్టే ఉద్దేశంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ డబ్బునే వాడారా?
తాజాగా బయటపడిన పత్రాలు గత నెలలో మయన్మార్లో మిలిటరీ తిరుగుబాటు తర్వాత లీక్ అయినట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. నిజానికి 2017లో రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి తరిమిన సమయంలోనే మయన్మార్ మిలిటరీపై అమెరికా ఆంక్షలు విధించింది. అప్పుడే అదానీ గ్రూపును ఈ డీల్ నుంచి తప్పుకోవాలని సూచించినా వినలేదని మానవ హక్కుల లాయర్ రావన్ ఆరఫ్ ఏబీసీ న్యూస్కు వెల్లడించారు. అంతర్జాతీయ నేరాలకు పాల్పడటానికి అదానీ గ్రూపు ఇచ్చిన డబ్బులను కూడా మయన్మార్ మిలిటరీ వాడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్కు సంబంధాలు ఉన్నట్లు 2019లో ఐక్యరాజ్య సమితి నివేదికలోనూ స్పష్టంగా ఉంది. మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మిలిటరీతో విదేశీ సంస్థలు సంబంధాలు నెరపకూడదని అప్పుడే ఆ యూఎన్ రిపోర్ట్ స్పష్టంగా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..