సీడీఎల్ నుంచి అనుమతులు రాకపోవడమే కారణం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్-వీ టీకా అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్టు రెడ్డీస్ల్యాబ్ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ఇప్పటివరకు సుమారు 30 లక్షల డోసులు హైదరాబాద్కు చేరుకున్నాయి. గత నెల 14 నుంచే వ్యాక్సిన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల రెండోవారంలో బహిరంగ మార్కెట్లోకి విడుదలచేయాలని భావించారు. టీకాలను పరీక్షల నిమిత్తం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీ (సీడీఎల్)కి పంపించారు. రెండువారాలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదు. దీంతో టీకాల విడుదల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టు రెడ్డీస్ల్యాబ్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 28 నగరాల్లో టీకాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికే కోల్డ్స్టోరేజీలను, సైప్లెచెయిన్ను సిద్ధంచేసినట్టు వివరించారు. దేశీయంగా టీకాలను ఉత్పత్తిచేసి మొత్తం 25 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు రెడ్డీస్ల్యాబ్ రష్యాతో ఒప్పందం చేసుకున్నది. తయారీ ఆలస్యం అవుతుండటం, కరోనా విజృంభిస్తుండటంతో 50 లక్షల డోసులను నేరుగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడు దశల్లో సుమారు 30 లక్షల డోసులు వచ్చాయి. మిగతావి ఈ నెలాఖరుకు లేదా జూలై మొదటివారంలో వస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.