టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ( Bhavina Patel ).. తాను సచిన్ టెండూల్కర్ను కలుస్తానని చెప్పింది. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో సాధించిన విజయాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు ఆమె తెలిపింది. తన ఆరాధ్య ప్లేయర్ను కలిసి, అతనికి తన మెడల్ చూపిస్తానని భవీనా చెప్పింది. నేను ఎప్పుడూ సచిన్ నుంచి ప్రేరణ పొందాను. అతన్ని నేరుగా కలవాలని అనుకుంటున్నాను. అతడు చెప్పే మోటివేషనల్ స్పీచ్లను వింటే నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ భవీనా చెప్పింది.
తన బలం ధ్యానం చేయడమే అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది. టేబుల్ టెన్నిస్ గేమ్ 10-15 నిమిషాల్లో ముగుస్తుంది. ఇది ప్రపంచంలో రెండో అత్యంత వేగంగా ముగిసిపోయే గేమ్. అందుకే నేను నా మెదడును మెడిటేషన్తో నియంత్రిస్తాను. అది ఆటపై దృష్టిసారించడానికి ఎంతగానో సాయపడుతుంది అని భవీనా తెలిపింది. ఆ ఏకాగ్రతతోనే ఆమె పారాలింపిక్స్లో చైనీస్ ప్లేయర్స్ను కూడా ఓడించగలిగింది.