టోక్యో: పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో సిల్వర్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది ఇండియన్ అథ్లెట్ భవీనా పటేల్( Bhavina Patel ). అసలు ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్లో ఇప్పటి వరకూ టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో ఇండియా గెలిచిన తొలి మెడల్ ఇదే కావడం విశేషం. అంతేకాదు ఫైనల్ చేరే క్రమంలో ఆమె రియో పారాలింపిక్స్ చాంపియన్ను, వరల్డ్ నంబర్ 3ని కూడా మట్టి కరిపించింది. ఇంతటి ఘనత సాధించిన భవీనా.. గోల్డ్ మెడల్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడింది. ఇవాళ నేను కాస్త నెర్వస్గా ఫీలయ్యాను. అందుకే నా 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కానీ నేను తర్వాతి టోర్నీలో దీనిని సరిదిద్దుకుంటాను. ఓ అథ్లెట్ తన 100 శాతం ప్రదర్శన ఇచ్చారంటే ఇక వాళ్లు ఓడిపోయినట్లు కాదు అని నేను ఎప్పుడూ నమ్ముతాను అని భనీనా చెప్పింది.
12 నెలల వయసులోనే పోలియో బారిన పడిన ఆమె.. తాను ఆడిన తొలి పారాలింపిక్స్లో చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. తొలి మ్యాచ్లోనే ఓడినా.. తర్వాత అద్భుతం పుంజుకొని ఏకంగా సిల్వర్ మెడల్ గెలవడం ఆమె ఆత్మస్థైర్యానికి అద్దం పడుతోంది. గుజరాత్లోని వాడ్నగర్కు చెందిన ఆమె.. తన గ్రాడ్యుయేషన్ సమయంలో ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. ఇప్పటి వరకూ వివిధ టోర్నీల్లో 5 గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్ ఇండియా తరఫున గెలిచింది. తనకు ఎదురయ్యే ప్రతి సవాలులోనూ ఓ అవకాశాన్ని వెతుక్కుంటానని భవీనా చెబుతోంది.
ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తన కోసం తెరుచుకూనే ఉంటుందని తాను నమ్ముతానని చెప్పింది. సమస్యలను సానుకూలంగా చూడటం వల్ల కఠోరంగా శ్రమించే ధైర్యాన్ని తనకు ఇస్తుందని భవీనా అంటోంది. ఇండియాకు రాగానే వచ్చే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతానని చెప్పింది.