లండన్: క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ సజావుగా జరిగేందుకు ఏకంగా రెండు దేశాల ప్రధానమంత్రులే ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సిరీస్కు ఉన్న అడ్డంకులు తొలగించడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో మాట్లాడటం గమనార్హం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి ఐదు టెస్ట్ల యాషెస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా ఆస్ట్రేలియాలో కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో క్రికెటర్లు కుటుంబాలతో ఆస్ట్రేలియా వెళ్లడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అదే జరిగితే సిరీస్ నుంచి తప్పుకుంటామనీ సీనియర్ క్రికెటర్లు కొందరు హెచ్చరించారు.
దీంతో ఈ అంశంపై తాను ఆస్ట్రేలియా ప్రధానితో చర్చించినట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కఠినమైన క్వారంటైన్ ఆంక్షలను కాస్త సడలించి ఇంగ్లండ్ క్రికెటర్లు తమ కుటుంబాలతో వచ్చేలా ఏర్పాట్లు చేయాలని మోరిసన్ను కోరినట్లు జాన్సన్ చెప్పారు. ఈ వారం మొదట్లో వాషింగ్టన్లో డిన్నర్ సందర్భంగా ఈ ఇద్దరు ప్రధానులు కలిశారు. ఈ సందర్భంగానే యాషెస్ అంశాన్ని లేవనెత్తగా.. క్రికెటర్ల కుటుంబాలను అనుమతించడంపై తాను చేయగలిగింది చేస్తానని మోరిసన్ హామీ ఇచ్చినట్లు జాన్సన్ చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా కుటుంబాలకు దూరంగా క్రికెటర్లు ఉండలేరన్న విషయాన్ని మోరిసన్ అర్థం చేసుకున్నారని తెలిపారు.