ముంబై: బర్త్ డే బాయ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పుట్టిన రోజు నాడు ఓ వీడియో సందేశాన్ని అభిమానులకు ఇచ్చాడు. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకున్న మాస్టర్.. తాను ప్లాస్మా దానం చేయనున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. కొవిడ్పై పోరాటంలో భాగంగా ప్లాస్మాను డొనేట్ చేయాలని మాస్టర్ కోరాడు. గతేడాది తానే ఓ ప్లాస్మా డొనేషన్ సెంటర్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ సందర్భంగానే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
గత నెలలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. కరోనా బారిన పడి 21 రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. మీ ప్రార్థనలు, ప్రేమాభిమానాలు, డాక్టర్ల శ్రమ, సానుకూల ఆలోచనలతో నేను కొవిడ్ నుంచి కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు అని సచిన్ అన్నాడు. సరైన సమయంలో ప్లాస్మా ఇస్తే కొవిడ్ పేషెంట్లు కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని, ఇదే సందేశాన్ని అందరికీ ఇవ్వాల్సిందిగా వాళ్లు చెప్పినట్లు మాస్టర్ తెలిపాడు. తాను కూడా త్వరలోనే ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు చెప్పాడు.