హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీ అభిమానులకు శుభవార్త. ఐదు దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగా అలరిస్తున్న ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీకి తొలిసారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన అస్ట్రో-టర్ఫ్ మైదానంలో నవంబర్ 14 నుంచి 25 వరకుఈ టోర్నీ జరుగనుంది. 57వ నెహ్రూ హాకీ టోర్నీకి గూంచా గ్రూపు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలను వెల్లడించారు. టోర్నీ వ్యవస్థాపకుడు ఇందర్మోహన్ కపూర్ గౌరవార్థం చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.10లక్షల ప్రైజ్మనీలో విజేతకు రూ. 4లక్షలు, రన్నరప్కు రూ.2లక్షలు దక్కనున్నాయి. ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా బెనెల్లీ మోటర్బైక్ను బహుమతిగా ఇవ్వనున్నారు.