మహబూబాబాద్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీ దేవి లకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బ్రాహ్మణ సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో తొర్రూరు బ్రాహ్మణ సంఘ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణులని ఎంత బాగా గౌరవిస్తారో మనందరికి తెలిసిందేనన్నారు. అదే బీజేపీ దేవుళ్ళని, ప్రజల భక్తి సెంటిమెంట్లను ఏ విధంగా రాజకీయం చేస్తున్నదో చూస్తున్నామన్నారు. తెలంగాణను కరోనా, వరదల సమయంలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మనల్ని ఆదుకొలేదన్నారు.
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అన్నారు. ఓట్లు, సీట్లకు అతీతంగా తమకు సేవ చేస్తున్న మహానుభావుడు అని కొనియాడారు. ప్రశ్నించే గొంతులు కాదు, పరిష్కరించే చేతులు కావాలి మనకి. ఎవరు ప్రశ్నించారని బ్రాహ్మణ పరిషత్తు, బ్రాహ్మణ సదన్ ఏర్పాటు, విదేశీ విద్య, ధూప దీప నైవేద్యాలు, జీతాల పెంపు వంటివి సీఎం కేసీఆర్ చేశారన్నారు. ఎవరో చెబితే జరిగినవి కావు ఇవన్ని. బ్రాహ్మణులు, సంఘాలు అడిగితే ఇచ్చినవి కూడా కావు. ఇవన్నీ సీఎం కేసీఆర్ స్వతహాగా చేసినవేనన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నేతలు గంగు ఉపేంద్ర శర్మ, కాకిరాల హరిప్రసాద్, రామచంద్రయ్య శర్మ, తదితరులు పాల్గొన్నారు.