అండగా ఉండాల్సిన తండ్రి.. మూడేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మ తాతయ్య కూడా రెండేళ్ల క్రితం అనంతలోకానికి వెళ్లిపోయారు. కూలీనాలీ చేస్తూ కడుపునింపుతున్న తల్లీ.. శుక్రవారం చనిపోయింది. దీంతో చిన్నారులు దేవానంద్(7), శృతి(3) ఒక్కసారిగా అనాథలయ్యారు. ఈ హృదయ విధారక ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని తండాలో చోటుచేసుకుంది.
ఈ చిన్నారుల తండ్రి మూడేళ్ల క్రితం ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య దగ్గర తల్లి సంగీతతో పాటు తలదాచుకున్నారు. వారు కూడా రెండేళ్ల క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి తల్లే వారి బాగోగులు చూసుకుంటున్నది. కూలీనాలీ చేస్తూ పిల్లలను చూసుకుంటున్నది. ఇంతలోనే ఆరునెలలుగా అనారోగ్యంతో సంగీత మంచంపట్టింది. న్యుమోనియాతో శుక్రవారం ఉదయం మృతిచెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ దగ్డే సునిత దేవిదాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ బాలల సంరక్షణ కేంద్రం, ఐసీడీఎస్ వారికి సమాచారం అందించారు. ఆ పిల్లలను ఆదుకునేందుకు కృషిచేస్తామని తెలిపారు.