హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీసీతారామస్వామి దేవస్థాన భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, మేడ్చల్ మలాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి సభ్యులుగా విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సత్వరమే రంగంలోకి దిగిన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం రాత్రే దేవాలయ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను పరిశీలించింది. మేడ్చల్- మలాజిగిరి జిల్లా, శామీర్పేట మండలంలోని దేవరయాంజాల్ గ్రామపరిధిలో వేల కోట్ల రూపాయల విలువచేసే 1521 ఎకరాల 13 గుంటల భూముల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్తోపాటు కొంతమంది పెద్దలు చట్ట విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడ్డారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఈ నెల 2న ‘నమస్తే తెలంగాణ’లో ‘సీతారామస్వామి నీ భూములు కనబడవేమీ!’ శీర్షికన వచ్చిన వార్తాకథనంపై స్పందించిన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశాలు జారీచేసింది. దర్యాప్తు వేగంగా పూర్తిచేసి సత్వరమే నివేదిక ఇవ్వాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో ఆదేశించారు.
మేడ్చల్: దేవరయాంజాల్లోని దేవాదాయ భూములలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ఉన్నత స్థాయి కమిటీ సోమవారం రాత్రి విచారణ ప్రారంభించింది. అంతకుముందు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో సమావేశమైంది. అనంతరం తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవర యాంజాల్లో ఈటల సతీమణి జమున పేరిట ఉన్న గోదాంలను కమిటీ చైర్మన్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు, సభ్యులు శ్వేతా మహంతి, భారతి హోళికేరి, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏసీబీ, విజిలెన్స్, పౌర సరఫరాలశాఖ అధికారుల బృందం పరిశీలించింది. జమున పేరిట 735 సర్వే నంబర్లో ఏడు గోదాంలు, 57 సర్వే నంబర్లోని 12 ఎకరాలలో 1.25 లక్షల చదరపు అడుగులలో గోదాములు నిర్మించారు. ఈ నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో నిర్మాణాలకు సంబంధించిన వివిధ ఫైళ్లను బృందం పరిశీలించింది. శ్రీసీతారామస్వామి దేవస్థానం కింద 1525 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఇందులో మొత్తం 115 అక్రమ గోదాంల నిర్మాణాలు జరిగినట్టు గుర్తించారు.
రెవెన్యూ, ఎండోమెంట్ రికార్డుల్లో సుమారు 1,425 ఎకరాల వరకు భూములు శ్రీసీతారామస్వామి దేవాలయం పేర ఉన్నట్టు గుర్తించినప్పటికీ పొజిషన్లో మాత్రం భారీ గోదాంలు, ఫాంహౌస్లు, గెస్ట్హౌస్లు ఉండటాన్ని పరిశీలించింది. ఈ భూములలోకి ఇంత పెద్ద భవంతులు ఎలా వచ్చాయి, ఏ ప్రభుత్వ హయాంలో వీటిని నిర్మించారు, అసలు వీటికి అనుమతులున్నాయా లేవా, ఈ భూములపై రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా, జరిగితే ఏ సమయంలో జరిగాయి, రిజిస్ట్రేషన్లు చేసిన అధికారి ఎవ్వరు అనే అంశాలను కూడా కలెక్టర్ల కమిటీ గుర్తించే పనిలో నిమగ్నమైంది.
ఈటల రాజేందర్ భార్య ఈటల జమున పేర ఉన్న గోడౌన్స్ను ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. దేవాలయ భూమిలో నిర్మించిన ఈ భారీ గోడౌన్స్కు కనీస అనుమతులు లేకున్నా.. బ్యాంకు రుణాలు ఎలా ఇచ్చారు అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూములపై మంగళవారం సుమారు 10 బృందాలతో సర్వే చేసే అవకాశాలున్నట్టు విశ్వాసనీయ సమాచారం.
వెల్దుర్తి: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలపై వరుసగా మూడోరోజు విచారణ కొనసాగింది. మెదక్ జిల్లా అచ్చంపేట పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వెల్దుర్తి ఎంపీడీవో జగదీశ్వరాచారితోపాటు అచ్చంపేట, హకీంపేట గ్రామాల పంచాయతీ కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించారు. జమున హ్యాచరీస్, దానికి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫీడ్మిల్, షెడ్ల కోసం తీసుకున్న అనుమతులు, సదరు నిర్మాణాలకు చెల్లించిన పన్నుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఇతర బృందాలు మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు, పహాణీలతో పాటు భూములకు సంబంధించిన పలు దస్త్రాలను, ప్రొసీడింగ్లను పరిశీలించినట్లు సమాచారం. జమున హ్యాచరీస్ భూములకు సంబంధించి పూర్తి విచారణ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, ఇందులో పలు శాఖల అధికారులను విచారించనున్నారని తెలిసింది.
కరీంనగర్ కాంగ్రెస్ నేత సత్యనారాయరావు విమర్శ
కమలాపూర్, మే 3: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీసీ ముసుగులో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొల్నేని సత్యనారాయణరావు ఆరోపించారు.వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కొనుగోలు చేశానని ఒప్పుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ దవాఖానలో డాక్టర్ ప్రవీణ్రెడ్డి నియామకం విషయంలో తప్పుడు డాటా ఎంటర్ చేయాలని ప్రవీణ్ యాదవ్ను హింసించలేదా? ఆయన మృతికి ఈటల రాజేందరే కారణమని తల్లిదండ్రులు చెప్పడం వాస్తవం కాదా అని నిలదీశారు. జమ్మికుంటలో శ్రీరామ్ అనే ఉద్యమకారుడు వలస వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తున్నావని ప్రశ్నించినందుకు పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కమలాపూర్లో ప్రభుత్వ భూమిలో దళితులు ఇండ్లు నిర్మించుకుంటే అక్రమ నిర్మాణాలు అంటూ కూలగొడుతుంటే మంత్రిగా ఎందుకు ఆపలేకపోయావని అడిగారు. తనకు పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యమంటున్న ఈటల వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలువాలని సవాల్ చేశారు. ఈటలకు వంతపాడుతున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర నాయకులు ఈటల చేసింది వాస్తవమా కాదా తెలుసుకుని మంచివాడో కాదో క్లీన్చీట్ ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో సింగిల్విండో డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, సర్పంచ్ చరణ్పటేల్, ఓబీసీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి టీ రవిందర్, మండల కాంగ్రెస్ ఇంచార్జి బొల్లం రాజిరెడ్డి, నాయకులు బాలసాని రమేశ్, పుల్ల అద్భుతరావు, పుల్ల శ్రీనివాస్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.