చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) తన మార్క్ షాట్లతో అలరించాడు. చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్వెల్ అర్ధశతకానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్(11), శాబాజ్ అహ్మద్(14), ఏబీ డివిలియర్స్(1), వాషింగ్టన్ సుందర్(8) తీవ్రంగా నిరాశపరిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ చప్పగా సాగింది. నదీమ్ వేసిన 11వ ఓవర్లో మాక్స్వెల్ వరుసగా 6, 4, 6 బాదగా కోహ్లీ 4 కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఈ ఒక్క ఓవర్ మినహా మిగతా ఓవర్లలో సన్రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కోహ్లీ, డివిలియర్స్ వరుస ఓవర్లలో ఔటవడంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేకపోయింది. కోహ్లీని హోల్డర్ ఔట్ చేయగా..ప్రమాదకర డివిలియర్స్ను రషీద్ ఖాన్ పెవిలియన్ పంపి బెంగళూరును ఒత్తిడిలో పడేశారు. ఆఖర్లో మాక్స్వెల్ కాస్త దూకుడుగా ఆడటంతో బెంగళూరు ప్రత్యర్థి సన్రైజర్స్కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.