హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో రోజురోజుకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్.. టైగర్ టీ20 టోర్నీతో సీజన్కు తెరలేపేందుకు సిద్ధమైతే… ఉపాధ్యక్షుడు జాన్మనోజ్ నేతృత్వంలోని వైరి వర్గం మూడు రోజుల లీగ్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అజర్ దూకుడైన నిర్ణయంతో డిఫెన్స్లో పడ్డ మనోజ్ వర్గం మూడు రోజుల లీగ్ను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అజర్ అధ్యక్షతన జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు టైగర్ టీ20 టోర్నీతో సీజన్ను మొదలుపెడుతున్నట్లు ఆయా క్లబ్ల కార్యదర్శులు, ప్లేయర్లకు సందేశం పంపారు. ‘బీసీసీఐ క్యాలెండర్ షెడ్యూల్ను అనుసరించి లీగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా వ్యక్తి లేదా బృందం/సస్పెన్షన్లో ఉన్న సభ్యులు మ్యాచ్లు నిర్వహిస్తే.. వాటిని ప్రైవేట్ మ్యాచ్లుగా పరిగణిస్తాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రికార్డుల్లోకి తీసుకోం. రూల్ 16ను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటాం’ అని అజర్ పేరిట హెచ్సీఏ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే..అపెక్స్ కౌన్సిల్ సభ్యుల తాత్కాలిక సస్పెన్షన్తో అజర్ కొత్త కార్యవర్గ సభ్యులను నియమించాడు. కార్యదర్శి పదవి తన వద్దే ఉంచుకున్న అజర్.. సుభద్ర సురి (ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి), సంతోష్ దవారె (కోశాధికారి), పార్త్ సాత్వాల్కర్ (కౌన్సిలర్) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నాడు. అజర్ నిర్ణయం పెద్ద జోక్ అన్న జాన్మనోజ్.. జస్టిస్ లోధా సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అతనిపై కోర్టులో తేల్చుకుంటామని తెలిపాడు.
మళ్లీ ఎన్నికలు పెట్టాలి: వినోద్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశాడు.