హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఆధిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతున్నది. హెచ్సీఏ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడన్న కారణంతో అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్కు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు షోకాజ్ నోటీసులు ఇచ్చి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జింఖానాలో గురువారం అజర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా అపెక్స్ కౌన్సిల్లోని ఐదుగురు సభ్యులు కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనురాధను లక్ష్యంగా చేసుకుంటూ అజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హెచ్సీఏ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మిక్కిలి క్లబ్లు కల్గి ఉన్న వీళ్ల బాగోతాలు ఎక్కడ బయటకు వస్తాయన్న కారణంతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న నేను.. ఎలాంటి బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్కు భయపడను. అపెక్స్ కౌన్సిల్లో తొమ్మిది మంది సభ్యులుంటే..ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి నాపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారు చేస్తున్నవన్ని అసత్యాలే. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఉప్పల్, జింఖానా మైదానాలు మినహా తెలంగాణలో ఎక్కడా స్టేడియాలు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఎన్నికలు జరిగితే ఎదుర్కొవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని అన్నాడు. మరోవైపు తమను ఒక వర్గంగా చిత్రీకరించడాన్ని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తప్పుబట్టారు. జస్టిస్ లోధా సిఫారసుల మేరకే అజర్కు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.