ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ విషయంపై నోరువిప్పాడు. త్వరలోనే తాను బౌలింగ్ చేస్తానని వెల్లడించాడు. శ్రీలంకలో చివరిగా బౌలింగ్ చేసిన పాండ్యాకు ఆ తర్వాత వీపుకు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత అతను మళ్లీ బౌలింగ్ చేయలేదు. దీనిపై ప్రశ్నించగా త్వరలోనే బౌలింగ్ చేస్తానని, దానికి కావలసిన కసరత్తులు చేస్తున్నానని తెలియజేశాడు.
ఈ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్దనే మాట్లాడుతూ బౌలింగ్పై మరీ ఫోకస్ పెడితే హార్దిక్ బ్యాటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. శ్రీలంక టూర్ నుంచి బౌలింగ్ చేయడం లేదు కాబట్టి, అతనికి ఏది మంచిదో అదే చేస్తున్నామని జయవర్దనే చెప్పాడు. ఈ విషయంలో భారత జట్టు మేనేజ్మెంట్తో కూడా చర్చలు జరుపుతున్నామని, పాండ్యా కంఫర్టబుల్గా ఉండేలా ప్రయత్నిస్తున్నామని వివరించాడు.
పాండ్యాతో రోజూ బౌలింగ్ చేయించి, అతను ఎలా వేస్తున్నాడో పరిశీలించిన తర్వాతనే ఐపీఎల్లో అతని చేతికి బంతినివ్వడం జరుగుతుందని వెల్లడించాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమితో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. మిగిలిన రెండు మ్యాచులను భారీ తేడాతో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంది.