శ్రీనగర్: గొంతెత్తే వారిపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏను ఉసిగొల్పుతారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ నెల 15న సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీనగర్లోని ఈడీ కార్యాలయంలో ఆమె హాజరు కాగా అధికారులు పలు గంటలపాటు ప్రశ్నించారు.
అనంతరం మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడారు. బిజ్బెహారాలోని ముఫ్తీ సాహెబ్, తనకు చెందిన భూమి అమ్మకం, ముఖ్యమంత్రి రహస్య నిధుల వినియోగం గురించి ఈడీ ప్రశ్నించిందని తెలిపారు. గొంతెత్తే వారిపై ఈడీ, ఎన్ఐఏను ఉసిగొల్పుతారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం దేశం నడవడం లేదని, ఒక పార్టీ అజెండా ప్రకారం నడుస్తున్నదని ఆరోపించారు. దేశంలో అసమ్మతిని తెలియజేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ పరిపాలిస్తున్నాయని ముఫ్తీ ఎద్దేవా చేశారు.