ముంబై: ఇండియా, పాకిస్థాన్( India vs Pakistan ) మధ్య టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో రెండు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా పాక్ మాజీ షోయబ్ అక్తర్కు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సరదాగే అయినా అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. క్రికెట్ ఆడే సమయంలోనూ వీళ్లిద్దరి మధ్య ఉన్న శతృత్వం తెలిసిందే. చాలాసార్లు గ్రౌండ్లోనే మాటామాటా అనుకున్నారు. ఇక ఇప్పుడు ఇండోపాక్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. మ్యాచ్పై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ తర్వాత భజ్జీని ట్రోల్ చేస్తూ ఆ విషయాన్ని ట్వీట్ చేశాడు షోయబ్ అక్తర్. మదర్ ఆఫ్ ఆల్ కాంపిటిషన్స్ వంటి మ్యాచ్పై చర్చలో నాకు అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి హర్భజన్తో కలిసి పాల్గొన్నానని అక్తర్ ఆ ట్వీట్లో చెప్పాడు. దీనికి భజ్జీ చాలా ఘాటుగానే స్పందించాడు. 200 కంటే తక్కువ వికెట్లు ఉన్న వ్యక్తి కంటే 400 కంటే ఎక్కువ వికెట్లు ఉన్న వ్యక్తికి క్రికెట్ గురించి ఎక్కువగా తెలుస్తుందని నాకు కచ్చితంగా తెలుసు అని హర్భజన్ రిప్లై ఇచ్చాడు.
గత వారం స్టార్స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ అక్తర్కు భజ్జీ సరదాగానే మంచి పంచ్ ఇచ్చాడు. మీరుకు ఎందుకు అనవసరంగా మాతో ఆడతారు? వాకోవర్ ఇస్తే అయిపోతుంది కదా అని నేను అక్తర్తో అన్నాను అని హర్భజన్ చెప్పాడు. మీరు మాతో ఆడతారు. మళ్లీ ఓడిపోతారు. బాధపడతారు. ఏం లాభం? అక్తర్.. మీకు అవకాశమే లేదు. మాది చాలా బలమైన టీమ్. మీ టీమ్ను ఊది పారేస్తుంది అని అక్తర్తో భజ్జీ అన్నాడు.