సౌతాంప్టన్ : భారత, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభంకానున్నది. మరి ఆ ఫైనల్లో ఎవరు గెలుస్తారో మీరు అంచనా వేశారా ? కోహ్లీసేననా లేక విలియమ్స్న్ టీమ్ విజయం సాధిస్తుందా ? ఫైనల్ రసవత్తరంగా ఉంటుందా ? ఏజియస్ బౌల్ స్టేడియంలో థ్రిల్లర్ను చూస్తామా లేదా ? సౌతాంప్టన్ వాతావరణం ఎవరికి అనుకూలిస్తుంది ? మన అంచనాలు ఎలా ఉన్నా.. మాజీ క్రికెట్ పండితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ న్యూజిలాండ్కే ఓటేశాడు. ఈ కామెంట్ చేసినందుకు సోషల్ మీడియాలో తనపై సెటైర్లు తప్పవని తెలుసన్నాడు. కానీ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టులను గమనిస్తే, కివీస్ సామర్థ్యం తెలుస్తుందన్నారు. హైక్లాస్ క్రికెట్ టీమ్గా కివీస్ ఎదిగిందన్నాడు. వారి ఆటలో ప్రతి అంశం నచ్చిందన్నాడు. చాలా సుదీర్ఘ కాలం ఎంతో క్రమశిక్షణతో క్రికెట్ను ఆడడం న్యూజిలాండ్కే సొంతం. పరిస్థితులను ఆ జట్టు చక్కగా అంచనా వేస్తుందన్నాడు. బౌలింగ్ అటాక్ చాలా నైపుణ్యంతో ఉందన్నాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా న్యూజిలాండ్కే జై కొట్టాడు. ఇంగ్లండ్తో సిరీస్ విన్ తర్వాత మరో గెలుపు దిశగా కివీస్ వెళ్తోందన్నాడు. వత్తిడిలో సులువుగా ఆడుతున్నారని, ఇంగ్లీష్ కండీషన్స్కు తగినట్లు ఆడడం అద్భుతమన్నాడు. టీమ్ సెలక్షన్ సరైన రీతిలో ఉంటే.. కివీస్ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, మాట్ హెన్రీ.. బౌలింగ్ రాణిస్తున్నారన్నారు.
ఇంగ్లండ్ మాజీ బౌలర్ ఇషా గుహ.. ఇండియా గెలుస్తున్నట్లు చెప్పారు. భారత జట్టులో డెప్త్ ఎక్కువగా ఉందన్నారు. కోహ్లీ నేతృత్వంలో చాలా క్వాలిటీ టీమ్ తయారైందరన్నారు. టాప్ సిక్స్లో రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్లు ఉన్నట్లు చెప్పారు. ఈ లైనప్ చాలా పటిష్టంగా ఉందన్నారు. మ్యాచ్ మాత్రం టెన్షన్ పుట్టించడం అనివార్యమన్నారు.
మాజీ ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ .. కోహ్లీ సేనదే ట్రోఫీ అన్నారు. ఎందుకంటే.. బ్యాటింగ్, బౌలింగ్లో ఇండియా బలంగా ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి సౌతాంప్టన్లో వెదర్ పొడిగా ఉందని, అంటే పిచ్లో తొందరగా పగుళ్ల వచ్చే అవకాశం ఉందని, దీంతో ఇండియన్ స్పిన్నర్లు తమ సత్తా చాటే అవకాశాలు ఉన్నట్లు గవాస్కర్ అంచనా వేశారు.
న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మెన్ క్రెయిగ్ మెక్మిలన్ తన ఓటు కివీస్కే వేశాడు. న్యూజిలాండ్ ఈ టోర్నీ కోసం ప్రిపేరైన తీరు అసాధారణమన్నారు.తాజా సిరీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించడం అమోఘమన్నారు. అందరు ఆటగాళ్లు ఫామ్లో ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం వాళ్లదే బెస్ట్ సైడ్ అని అన్నాడు. ఇండియా ఓ ప్రమాదకరమైన జట్టు అని, కానీ నిలకడగా ఆడుతున్న కివీస్ వాళ్లను ఓడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్రికెట్ కరస్పాండెంట్ జోనాథన్ .. ఇండియా గెలుస్తుందని అంచనా వేశాడు. నిజానికి కివీస్ టీమ్ బెటర్గా ఉందని, ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్లోనైనా లేక న్యూజిలాండ్లోనైనా ఒకేలా వెదర్ ఉంటుందని, కివీస్ బౌలింగ్ బృందానికి ఇది అనుకూలిస్తుందన్నారు. అయితే పొడి వాతావరణం వల్ల స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని భావించాడు. గుండె కివీస్కే ఓటేసినా.. గెలుపు మాత్రం ఇండియాదే అన్నాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ జెర్మీ కానే స్వదేశానికి ఎక్కువ ఛాన్సు ఉన్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్లో ఒకవేళ కివీస్కు మంచి స్టార్ట్ దొరికితే, ఇక బ్లాక్క్యాప్స్ను ఎవరూ ఆపలేరన్నారు. కివీస్ ఫీల్డింగ్ బాగుంటుందన్నాడు. అదే ఆటను మార్చేస్తుందన్నాడు. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఫిల్ టఫ్నెల్ .. ఇండియా విజయం సాధిస్తుందన్నాడు. రెండు జట్లు అద్భుతంగా ఉన్నా.. స్పిన్నర్ అశ్విన్ మాయాజాలం కివీస్ను చిత్తు చేస్తుందన్నాడు. టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కామెంటేటర్లు అలిసన్ మిచ్చల్, డానియల్ నార్క్రాస్లు న్యూజిలాండ్దే ట్రోఫీ అన్నారు.