న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించి సగర్వంగా తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఘనస్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడాకారుల కుటుంబసభ్యులు, క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయింది. భారత్ మాతా కీ జై.. నినాదాలు మార్మోగాయి. సూర్మ నీరజ్ చోప్రా, రవి దహియా, బజరంగ్ పూనియా, లోవ్లినా బోర్గోహైన్ తోపాటు పురుష, మహిళా హాకీ క్రీడాకారులు సోమవారం సాయంత్రం భారతదేశానికి తిరిగి వచ్చారు. అథ్లెట్లందరికీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్ ఛాంపియన్లకు బ్యాండ్ వాగన్తో స్వాగతం పలికారు.
గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అలాగే, లవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పూనియా, రవి దహియా, దీపక్ పూనియా కూడా ఢిల్లీ చేరుకున్నారు. పురుషుల, మహిళల హాకీ జట్లకు కూడా బ్యాండ్వాగన్తో స్వాగతం పలికారు. మహిళల హాకీ జట్టు, దీపక్ పూనియ కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో విమానాశ్రయం అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రీడాభిమానుల కోలాహాలంతో పతకధారులు వీవీఐపీ గేటు నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అప్పటి వరకు ఎదురుచూసిన మీడియా.. వారిని అనుసరించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
నీరజ్ చోప్రా తల్లి సరోజాదేవి తన కొడుకును చూసేందుకు చాలా సేపటి నుంచి ఎదురుచూస్తూ కూర్చున్నది. నీరజ్ విమానం దిగి రాగానే వెంటనే అతడిని కౌగిలించుని ఆశీర్వాదం అందజేసింది. ఎయిర్పోర్టులోనే కొడుకుకు ఎంతో ఇష్టమైన చుర్మా తినిపించింది. నీరజ్ సోదరి సంగీత సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. సోదరుడిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించింది. నీరజ్ తండ్రి కూడా చాలా సంతోషంగా కనిపించారు.
విమానాశ్రయంలోనే క్రీడాకారులకు ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి హోటల్ అశోకాకు బయల్దేరి వెళ్లారు. హోటల్ అశోకా వద్ద భారత ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు క్రీడాకారులకు ఘనంగా స్వాగతించారు.
భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అశోక హోటల్లో వేడుకలు జరుపుకున్నాయి. హోటల్లో ఇరు జట్లు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, మహిళల హాకీ జట్టు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నది. కాంస్య పతక పోరులో బ్రిటన్ చేతిలో 4-3తో ఓడిపోయింది. కాగా, పతకం గెలిచిన మరునాడు మీరాబాయి చాను, పీవీ సింధూలు భారతదేశానికి చేరుకున్నారు.
సరైన సమయంలో నాణ్యమైన సేవలు అందించాలి : వెంకయ్యనాయుడు
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
జూలై నెలలో పెరిగిన వాహనాల డిమాండ్
ఆఫ్ఘాన్ నుంచి మన వాళ్లను రప్పించండి : కాంగ్రెస్
12 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..