హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెయిలింగ్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఆసియా గేమ్స్కు (2022) సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీకి తొలిసారి జాతీయ యాచింగ్ సమాఖ్య(వైఏఐ) గుర్తింపునిచ్చింది. తెలంగాణ సహా వివిధ రాష్ర్టాల నుంచి 120 మందికిపైగా సెయిలర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ‘ప్రతిభ కల్గిన సెయిలర్లను గుర్తించేందుకు చాంపియన్షిప్ను నిర్వహిస్తున్న ఈఎమ్ఈఎస్ఏకు అభినందనలు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో రాణించడం ద్వారా దేశ ఖ్యాతిని సెయిలర్లు ఇనుమడింపజేయాలి’ అని అన్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సెయిలర్లు నేత్రా కుమానన్, విష్ణు సరవణన్ను గవర్నర్ ఘనంగా సన్మానించారు.