హైదరాబాద్, ఆట ప్రతినిధి, శంషాబాద్: వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలువడం చాలా గర్వంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రియోలో రజతం తర్వాత టోక్యోలో కాంస్యంతో మెరిసిన సింధు.. విశ్వక్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింధు పలు అంశాలపై మాట్లాడింది. ‘రియో ఒలింపిక్స్లో రజత ప్రదర్శన తర్వాత ఈసారి నాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఎలాగైనా పసిడి పతకం కొట్టాలన్న పట్టుదలతో ప్రాక్టీస్ కొనసాగించాను. కానీ ఫలితం మరోలా వచ్చింది. అయినా నిరాశ చెందడం లేదు. ఈ సందర్భాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నా. నేను పతకం సాధించడం వెనుక చాలా మంది కృషి దాగుంది. ముఖ్యంగా కోచ్ పార్క్ టే సంగ్ దాదాపు ఏడాది కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ నాకు శిక్షణ ఇచ్చాడు. ఎక్కడా లోపాలు లేకుండా సుచిత్రా అకాడమీ నిర్వాహకులు శిక్షణ ఏర్పాట్లు కల్పించారు. దీనికి తోడు కుటుంబసభ్యుల త్యాగం మరువలేనిది. అడిగిన వెంటనే ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. టోక్యో ఒలింపిక్స్ కోసం గత ఫిబ్రవరి నుంచి స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం బాగా కలిసొచ్చింది. టోక్యో లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండటం వలన ప్రాక్టీస్కు ఉపయోగపడింది. భవిష్యత్లోనూ ఇక్కడే శిక్షణ కొనసాగిస్తా. పారిస్(2024) ఒలింపిక్స్పై కూడా దృష్టి పెట్టాను’ అని సింధు చెప్పింది. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో సింధుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందించి శాలువాతో సింధు, కోచ్ సంగ్ను మంత్రి సన్మానించారు. వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించిన సింధు తెలుగు రాష్ర్టాలకు గర్వకారణంగా నిలిచిందని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, గతంలోనూ సింధుకు ప్రోత్సాహకాలు అందించామన్నారు.