సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని సిరిసిల్ల కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని విజయంతం చేసిన జిల్లా యంత్రాంగానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. గడిచిన ఏడేండ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగాయన్నారు. మిడ్మానేరుకు రాజరాజేశ్వరస్వామి పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం పుణ్యమాని మండుటెండలో మానేరు మత్తడి దుంకిన అద్భుత దృశ్యాన్ని చూడగలిగామన్నారు. కేవలం రిజర్వాయర్లు కట్టడం మాత్రమే కాదు మిషన్ కాకతీయ కూడా దిగ్విజయం అయినట్లు తెలిపారు. సిరిసిల్లలో ఆరు మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చినయి తీరును పాఠ్యాంశంగా కూడా మార్చిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అప్పర్మానేరు కట్టి 75 ఏైళ్లెనా గతంలో ఏనాడు జూన్ నెలలో నీళ్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూలవాగు మీద 24 చెక్డ్యాంలు మంజూరు చేస్తే వాటిలో కేవలం 8 మాత్రమే పూర్తైనట్లు తెలిపారు. మూలవాగుపై మరో 12 చెక్డ్యాంలు కట్టవచ్చని అధికారులు చెబుతున్నారని ఈ మేరకు వాటిని మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అప్పర్మానేరు డ్యాం గతంలో ఏనాడు మరమ్మత్తులకు నోచుకోలేదని.. అప్పర్మానేరు రిపేర్ల కోసం నిధులు కేటాయించాలని సీఎంను కోరుతున్నట్లు పేర్కొన్నారు.