హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐదు నెలల తర్వాత దేశవాళీ గోల్ఫ్ సీజన్ మొదలవుతున్నది. గురువారం నుంచి గోల్కోండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్కు తెరలేవనుంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె, మాజీ ఆసియా టూర్ విజేతలు రషీద్ఖాన్, కలిన్ జోషి, కరణ్దీప్ కొచ్చార్, విరాజ్ మాడప్ప, అమన్ రాజ్ లాంటి స్టార్ గోల్ఫర్లు టోర్నీ బరిలోకి దిగుతున్నారు. వీరితో సహా 123 మంది ప్రొఫెషనల్స్, ఆరుగురు అమెచ్యూర్ గోల్ఫర్లు పోటీపడనున్నారు. తెలంగాణ టూరిజం, వూటీ, హల్దీ గోల్ఫ్ కౌంటీ సహకారంతో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ జరుగనుంది. ఈ సందర్భంగా క్రీడా, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘గోల్కోండ మాస్టర్స్ టోర్నీలో భాగం కావడం గర్వంగా ఉంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుంది. దీనికి తోడు గోల్ఫ్కు హైదరాబాద్ కేంద్ర బిందువు కానుంది. టోర్నీలో పోటీపడుతున్న గోల్ఫర్లందరికీ ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.