తన చేతిరాతతో ఎందరి జీవితాలనో మార్చిన రాతగాడు. తన ఉపన్యాసాలతో ఇంకెందరిలోనోఉత్సాహం కలిగించిన మాటకారి. తన గాత్రంతో దేశభక్తిని పురిగొల్పిన గాయకుడు.ఇలా ఆయనలో ఎన్నో పార్శాలు. తన ఆసక్తులనే విద్యార్థుల శక్తులుగా మలిచిన
ఉపాధ్యాయుడు సిద్దిపేటకు చెందిన ఎజాస్ అహ్మద్. దశాబ్దాలుగా వేలమంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పరిచయమిది.
1986 సిద్దిపేట సమీపంలో తడ్కపల్లిలోని విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టారు ఎజాస్ అహ్మద్. బోర్డు మీద ఆయన రాసిన అక్షరాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. నోటుబుక్కులో రాత చూసి అచ్చు కాగితం అనుకున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు. ఆయన రాసే రాత అందంగా ఉండేది కానీ, బాల్యంలో ఎజాస్ తలరాతలో కొట్టివేతలే ఎక్కువ. మొదట్లో ప్రేమగా దత్తత తీసుకున్నవాళ్లే.. పిల్లలు కలిగిన తర్వాత చూసీచూడనట్లుగా వ్యవహరించారు. మళ్లీ చిన్నమ్మ చెంతకు చేరారు. బీఎస్సీ (ఆనర్స్) జువాలజీ పట్టభద్రుడైన తర్వాత ఉద్యోగం కోసం విద్యారణ్య ఆవాసానికి వచ్చాడు. కొన్నాళ్లకు సిద్దిపేటలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడా ‘భలే మాస్టారు’ అనిపించుకున్నారు.
పాఠశాల స్థాపకుడిగా
తన ఆశయాలకు తగ్గట్టుగా విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో 1994లో సిద్దిపేటలో శుభోదయ విద్యాలయాన్ని స్థాపించారు. దీనిని ఇప్పటి మన ముఖ్యమంత్రి, అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ ప్రారంభించారు. అహ్మద్ తన భార్య ఖమర్ జహావీరతో కలిసి 24 ఏండ్ల పాటు విద్యా సంస్థను విజయవంతంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. కళాకారులుగా ఎదిగిన వారు కొందరైతే, ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించారు అనేకం. అహ్మద్ సారథ్యంలో ఆయన విద్యార్థి గణం తెలంగాణ సాధనలోనూ పాలుపంచుకున్నది. అహ్మద్, ఖమర్ జహావీర దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె వసియా జహా, కుమారుడు అబ్రార్ అహ్మద్.
చేతిరాత నిపుణుడిగా
రాయడం ఒక కళ అని.. దానిని మనసు పెట్టి నేర్చుకోవాలని విద్యార్థులకు బోధించేవారు ఆయన. తన పాఠశాల విద్యార్థులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ రాసే విధానంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేవారు అహ్మద్. ఏ అక్షరాన్ని ఎలా రాయాలో ఆకట్టుకునేలా చెబుతూ అక్షరాలు దిద్దించేవారు. ‘అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే’ అనే పుస్తకానికి రూపకల్పన చేశారు అహ్మద్. లక్షల ప్రతులను విద్యార్థులకు పంచి ఎందరి చేతిరాతనో ప్రభావితం చేశారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సూచన మేరకు శ్రీనివాస్ ప్రశాంతి నేతృత్వంలోని ‘డిఫరెంట్ స్ట్రోక్స్ సంస్థ’ ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చేతిరాత తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ రాత పాఠాలు సీడీల రూపంలోనూ లక్షల మంది విద్యార్థులకు చేరువయ్యాయి.
విఖ్యాత వ్యాఖ్యాతగా
అహ్మద్ రాతే కాదు, మాట కూడా అందంగా ఉంటుంది. సిద్దిపేట వాసవీ క్లబ్ వారి ఓ కార్యక్రమంతో ప్రారంభమైన వ్యాఖ్యాన ప్రస్థానం.. నలుగురు ముఖ్యమంత్రుల సభలకు సంధానకర్తగా వ్యవహరించి, అందరి మన్ననలు పొందేవరకూ వెళ్లింది. స్థానికంగా న్యూస్ చానల్ ప్రారంభించి 18 ఏండ్లుగా న్యూస్ రీడర్గానూ పేరుతెచ్చుకున్నారు. అదే చానల్ కోసం సిద్దిపేటలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను పరిచయం చేస్తూ ‘జీవన చిత్రం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గాయకుడిగానూ సత్తా చాటుకున్నారు ఎజాస్ అహ్మద్. సిద్దిపేట జిల్లా జాగృతి అధ్యక్షుడిగా తెలంగాణ సంప్రదాయం చాటేవిధంగా సాహితీ, సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. ‘చేతిరాత జీవితాలను మారుస్తుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు’ అంటారాయన.
ఆనంద్ మహీంద్రా ఆనందం
అమెరికాలోని తెలుగువారి పిల్లలకు పద్యాలు శ్లోకాలు, దేశభక్తి గేయాలు ఆన్లైన్లో నేర్పిస్తున్నారు ఎజాస్. ‘బ్యాక్ టు నాలెడ్జ్’ హైదరాబాద్ సంస్థ ద్వారా ఆన్లైన్లో చేతిరాత తరగతులు నిర్వహిస్తున్నారు. ‘టిక టిక టిక టిక టికొక్కటి’ అంటూ నల్లబల్లపై చాక్పీస్తో అహ్మద్ చేసిన విన్యాసం వైరల్ అయింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను 40కిపైగా దేశాల్లో 10కోట్ల మంది వీక్షించడం విశేషం. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను చూసి, అహ్మద్కు లక్ష రూపాయలు బహుమతిగా ప్రకటించడం విశేషం.
-కత్తుల శ్రీనివాస్రెడ్డి