న్యూయార్క్: యూఎస్ ఓపెన్లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. స్టార్లు లేకుండా జరుగుతున్న టోర్నీలో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన అనామక ప్లేయర్లు అదరొడుతున్నారు. కెనడా యువ కెరటం లైలా ఫెర్నాండెజ్ అద్భుత విజయాలతో దూసుకెళుతున్నది. కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకునేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. యూఎస్ ఓపెన్లో అడుగుపెట్టినప్పట్నుంచి టాప్సీడ్ క్రీడాకారిణులను ఇంటిబాట పట్టిస్తున్న లైలా.. మంగళవారం రాత్రి ఇక్కడి ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో అద్భుత విజయంతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్లో ఫెర్నాండెజ్ 6-3, 3-6, 7-6 (7/5)తో ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా(ఉక్రేనియా)ను చిత్తు చేసి తొలిసారి సెమీస్కు చేరింది. ఇప్పటికే ఆమె మూడో రౌండ్లో నాలుగు సార్లు చాంపియన్ టాప్సీడ్ నవోమి ఒసాకాను, నాలుగో రౌండ్లో కెర్బర్ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటి మ్యాచ్లో బెదురు లేకుండా ఆడిన లైలా.. తొలి సెట్లో గెలిచి రెండో సెట్లో వెనుకబడ్డా తిరిగి పుంజుకుని ఆఖరి సెట్లో స్వితోలినాను కంగుతినిపించింది.
సెమీస్లో మెద్వెదెవ్
పురుషుల సింగిల్స్లో వరల్డ్ నంబర్టూ ప్లేయర్ డానియల్ మెద్వెదెవ్ సెమీస్లోకి ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్లో 6-3, 6-0, 4-6, 7-5తో బోటిక్ వాండె(నెదర్లాండ్)పై విజయం సాధించాడు. మరో క్వార్టర్స్లో కెనడా యువ ఆటగాడు అగర్ అలియాసిమ్ వాకోవర్తో సెమీస్లోకి వెళ్లాడు. శనివారం జరిగే సెమీస్ పోరులో మెద్వెదెవ్తో అలియాసిమ్ తలపడనున్నాడు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికా ద్వయం సామ్ కెర్రీ-స్టీవ్ జాన్సన్ 6-2, 7-6 (5)తో ఆరో సీడ్ కెవిన్-హోరియాలపై గెలుపొంది సెమీస్కు చేరుకున్నారు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో అమెరికా ఆశలు వదులుకోగా డబుల్స్లో సామ్ కెర్రీ-స్టీవ్ జాన్సన్ మాత్రమే టైటిల్ పోరులో మిగిలారు. 1881 తర్వాత యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఒక్క అమెరికా ఆటగాడూ లేకపోవడం ఇదే తొలిసారి.