న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు టోకరా వేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లిన భారతీయ అదికారుల బృందం ఉత్త చేతులతో వెనుదిరిగింది. చోక్సీపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణను డొమినికా న్యాయస్థానం జూలై వరకు వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ తదితర విభాగాలకు చెందిన ఎనిమిది మంది అధికారుల బృందం ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ప్రైవేటు విమానంలో స్వదేశం పయనమయ్యారు. డొమినికన్ కోర్టు చోక్సీ అప్పగింతకు అనుమతిస్తే అతడిని అదే విమానంలో భారత్కు తీసుకువద్దామని అధికారుల బృందం భావించింది. కాగా చట్ట విరుద్దంగా డొమినికాలోకి ప్రవేశించిన కేసులో చోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో అనేకమందికి బెయిల్ ఇవ్వడం జరిగిందని చోక్సీ న్యాయవాదులు కోర్టు తెలిపినా ఫలితం లేకపోయింది. చోక్సీ పారిపోయేందుకు అవకాసాలున్నాయని, అతనిపై ఇంటర్పోల్ నోటీసులు కూడా ఉన్నాయని డొమినికా ప్రభుత్వం కోర్టుకు గుర్తు చేయడమే ఇందుకు కారణం. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల వరకు ముంచిన చోక్సీ 2018లో దేశవిడిచి పారిపోయి యాంటిగ్వాలో తేలాడు. డబ్బుపోసి అక్కడి పౌరసత్వం కొనుక్కున్నట్టుగా వార్తలు వచ్చాయి. 62 సంవత్సరాల చోక్సీ యాంటిగ్వా నుంచి డొమినికా మీదుగా క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిచాడు. మే 23 నుంచి ఆయన కనిపించకపోవడంతో యాంటిగ్వా గాలింపు మొదలుపెట్టింది. మే 27న చోక్సీ డొమినికా అధికారులకు పట్టుబడ్డాడు. అతడిని యాంటిగ్వా పంపకుండా నేరుగా భారత్కు అప్పగించాలని డొమినికాకు యాంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. కానీ డొమినికా కోర్టులో చోక్సీ న్యాయవాదులు అతడు భారత్ పౌరుడు ఎంతమాత్రం కాదని, యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నారని వాదించారు. కోర్టు కేసు ఇంకా ఎటూ తేలకపోవడంతో భారతీయ అధికారుల బృందం ఇంటిదారి పట్టింది.