కొవిడ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
నిర్మల్ టౌన్, మార్చి 30 : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యాసంగిలో సాగు చేసిన పంట కొనుగోళ్లకు పక్కాగా ప్రణాళికను రూపొందించుకొని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020-21 యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంట వివరాలను పక్కాగా సర్వేచేసి ఆన్లైన్లో నమోదు చేశామని గుర్తు చేశారు. పంటల నమోదు ఆధారంగా దిగుబడులను అంచనా వేసి కొనుగోలు కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొవిడ్ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ పద్ధతులను ప్రజలకు వివరించి, టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. వీసీలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ, కొవిడ్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే మహారాష్ట్ర నుంచి రాకపోకలపై నిషేధం విధించామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, పౌర సరఫరాశాఖ అధికారి కిరణ్కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అవినాశ్, తదితరులు పాల్గొన్నారు.