హైదరాబాద్ : కలకాలం గుర్తుండే విధంగా రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం అని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే కేశవరావు స్పష్టం చేశారు. పీవీ మార్గ్లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో కేకే పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గతేడాది సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది కాలం పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం. కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయాం.
తెలంగాణ గడ్డమీద పీవీ ఘనత చిరస్థాయిగా నిలిచిపోయింది. పీవీ రచనలను వెలుగులోకి తీసుకొచ్చాం. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నమస్తే పీవీ పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు. వెబినార్లు, అంతర్జాతీయ మీటింగ్లు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో పీవీ పోట్రెయిట్ను త్వరలోనే సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. పీవీ సొంతూరు వంగరలో పీవీ పార్కులు, మ్యూజియంలు ఏర్పాటు చేసుకుంటున్నాం అని కేకే పేర్కొన్నారు.