మండలంలోని 29గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం నూరుశాతం పూర్తయ్యింది. ప్రతి గ్రామానికి ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లో ప్రతి రోజూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులు, కంపోస్టు షెడ్లో ఎరువులు తయారీకి సిద్ధం చేస్తున్నారు. గ్రామాల సిబ్బంది పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ విధిగా ప్రతి రోజూ వార్డుల వారీగా డ్రైనేజీ పూడిక తీస్తున్నారు. చెత్తను సేకరించడం, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.
ఆహ్లాదకర వాతావరణం..
గ్రామాలతో పాటు ఆవాస ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. పల్లె ప్రకృతి వనాల నిర్మాణంపై పంచాయతీ పాలకవర్గం, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మండలంలో 47పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వ భూ వివాదం కారణంగా న్యూబంజారాహిల్స్తండాలో మాత్రమే నిలిచిపోయింది. మిగతా అన్ని గ్రామాల్లోనూ పల్లె ప్రకృతి వనాలతో నూతన శోభ అల్లుకుపోయింది.
అన్ని హంగులతో వైకుంఠధామాలు…
గతంలో శ్మశాన వాటికలు లేక రోడ్ల వెంట దహన సంస్కారాలు జరిగేవి. కానీ, ప్రస్తుతం ప్రతి గ్రామంలో అత్యాధునిక హంగులతో వైకుంఠధామాల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. మండలంలోని 29గ్రామాలకు గాను 23 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కాగా, మరో 6గ్రామాల్లో పురోగతిలో ఉన్నాయి. నాగులపాటి అన్నారం ఎంపీటీసీ మండాది హరితానగేశ్ తన అత్త,మామల పేరిట శ్మశాన వాటిక కోసం భూమిని కొనుగోలు చేసి నిర్మాణం ప్రారంభించాడు. అన్ని గ్రామాలు అన్నారంను ఆదర్శంగా తీసుకోవాలని వైకుంఠధామాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతిలో అనంతారానికి ఉత్తమ అవార్డు..
ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏడాదిలోపే అనంతారం గ్రామంలో పనులన్నీ పూర్తయ్యాయి. గ్రామ సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాలక వర్గ సహకారం, కార్యదర్శి రాజేశ్ సలహాలు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అధికారులు పరిశీలించి అభినందలు తెలుపగా నాటి కలెక్టర్ అమయ్ కుమార్ జిల్లా ఉత్తమ పంచాయతీ అవార్డును సర్పంచ్కు అందించారు.