న్యూఢిల్లీ: పారాలింపిక్స్లో అద్వితీయ ప్రదర్శనతో కొత్త చరిత్ర లిఖించిన అథ్లెట్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. టోక్యో నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకున్న అథ్లెట్లకు.. అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించి పట్టికలో 24వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం విశ్వక్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొన్న షూటర్లు అవని, మనీశ్ నర్వాల్, సింగ్రాజ్ అదానా.. షట్లర్లు ప్రమోద్ భగత్, సుహాస్ యతిరాజ్, కృష్ణ నాగర్, మనోజ్ సర్కార్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే.. అథ్లెట్ల కుటుంబ సభ్యులు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. పూలదండలు, మంగళహారుతులతో హంగామా చేశారు. హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్ అథ్లెట్లకు స్వాగతం పలుకగా.. ఒక్కసారిగా విమానాశ్రయం మారుమోగిపోయింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన పారా అథ్లెట్లు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలువనున్నారు.