న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021( IPL 2021 )లో మిగిలిపోయిన మ్యాచ్లు మరికొన్ని రోజుల్లో యూఏఈలో జరగనున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మిగిలిపోయిన సీజన్కు రాకూడదని ఇంగ్లండ్ క్రికెటర్లు డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్స్టో నిర్ణయించారు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా మండిపడ్డాడు. వాళ్లు చేసిన పనిని ఐపీఎల్ కుటుంబం ఎప్పటికీ మరచిపోదని, భవిష్యత్తులో వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అతడు హెచ్చరించడం గమనార్హం.
బట్లర్, ఆర్చర్, స్టోక్స్ ఇప్పటికే ఐపీఎల్కు దూరమయ్యారు. ఇప్పుడు మలన్, వోక్స్, బెయిర్స్టో కూడా రావడం లేదని చెప్పారు. ఆ లెక్కన అర డజను మంది ఇంగ్లండ్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడటం లేదు. ఇది సామూహికంగా టోర్నీ ఎగ్గొట్టడమే అవుతుంది. ఐపీఎల్ కుటుంబం ఎప్పటికీ దీనిని మరచిపోదు అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
ఓ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవడం అంటే ఆ ప్లేయర్ తమను మోసం చేశాడని, నమ్మక ద్రోహం చేశాడని ఫ్రాంచైజీలు భావిస్తాయని ఇంగ్లండ్ ప్లేయర్స్ గుర్తు పెట్టుకోవాలని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇలా సడెన్గా ప్లేయర్స్ తప్పుకోవడం ఫ్రాంచైజీలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఓ ప్లేయర్ ఎంతో ముఖ్యమనుకొని ఫ్రాంచైజీలు వ్యూహరచన చేస్తాయని, ఆ ప్లేయర్ సడెన్గా తప్పుకుంటే సదరు ప్లేయర్ను భవిష్యత్తులో ఆయా ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశమే ఉండదని ఆకాశ్ చోప్రా అన్నాడు.