తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ కేసు లక్ష్యంగా కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కొద్దిపాటి బంగారం కోసం కేరళలోని ఎల్డీఎఫ్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని వ్యాఖ్యానించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మంగళవారం పలక్కాడ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల మధ్య రహస్య అవగాహన ఉందని ప్రధాని ఆరోపించారు.
గత కొన్ని దశాబ్ధాలుగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రాన్ని నిండా ముంచాయని, ప్రజలు తొలిసారిగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మ్యాచ్ ఫిక్సింగ్ను నిలదీస్తున్నారని అన్నారు. ఈ రెండు కూటములు తమను ఎలా తప్పుదారిపట్టించాయో ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఒక్కటయ్యాయని, యూపీఏ వన్లో భాగస్వామ్యమయ్యాయని కేరళలో మాత్రం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రెండూ కేరళలో టూరిజం రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.