దుబాయ్: ప్రధాని నరేంద్ర మోదీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయనో హీరో అని కొనియాడాడు. మిగతా దేశాధినేతలు కూడా మోదీలాగే ఉండాలని అన్నాడు. అస్సాంలో ఖడ్గమృగాల సంరక్షణ విషయం మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకుగాను కేపీ ఇలాంటి ప్రధానిని ఆకాశానికెత్తారు. ఇలాంటి చర్యల వల్లే ఇండియాలో ఖడ్గమృగాల సంఖ్య వేగంగా పెరుగుతోందని కేపీ అభిప్రాయపడ్డాడు. రైనోలను వేటాడకుండా కఠిన చర్యలు తీసుకున్న అస్సాం టీమ్ను ప్రశంసిస్తూ మోదీ చేసిన ట్వీట్ను పీటర్సన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
ప్రపంచ రైనో డే అయిన ఈ నెల 22న అస్సాం ప్రభుత్వం 2479 రైనో కొమ్ములను పబ్లిగ్గా దహనం చేసిన విషయం తెలిసిందే. ఒక కొమ్ము రైనోల జాతికి ముప్పు పొంచి ఉన్న వేళ అస్సాంలో ఎక్కువగా ఉన్న వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో వీటిని చూడొచ్చు. సాంప్రదాయ మందుల్లో వాడతారంటూ ఈ రైనోల కొమ్ములకు డిమాండ్ ఏర్పడటంతో వాటిని వేటాడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.