ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోని వేర్వేరు జట్లలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. కఠిన బయో బబుల్లో ఉన్నప్పటికి లీగ్లో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఐపీఎల్-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దేశీయ ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్ 2021 రద్దుతో విదేశీ ఆటగాళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు నిషేధం విధించాయి. దీంతో ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు తమ ఇంటికి ఎలా వెళ్లాలని ఆయా ఫ్రాంఛైజీలను అడుగుతున్నారు. మా దేశానికి ఎలా వెళ్లాలని విదేశీ ఆటగాళ్లు అడుగుతున్నట్లు ఓ ఫ్రాంఛైజీ అధికారి వెల్లడించారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సహా ఆసీస్ ఆటగాళ్లు అండ్రూ టై, రిచర్డ్సన్, జంపా ఈ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు భారత్ నుంచి విమానాల రాకపోకలను ఆస్ట్రేలియా నిషేధించడంతో ఆ దేశ ఆటగాళ్లలో చింత మరింత ఎక్కువైంది.
మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని బీసీసీఐ ఇప్పటికే హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించింది. ఐతే సీజన్ను అనూహ్యంగా వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లను వారి ఇళ్లకు పంపించడానికి బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.