‘జ్యోతిష్మతి’ విద్యాసంస్థల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
సద్వినియోగం చేసుకుంటున్న సుభాష్నగర్ గ్రామస్తులు
తిమ్మాపూర్ రూరల్, జూన్ 9: తెల్లవారు లేచింది మొదలు.. నిద్రకు ఉపక్రమించే వరకు ప్రతి మనిషికి తాగునీరు కావాలి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో శుద్ధజలం (మినరల్ వాటర్) తాగుతున్నారు. తాగునీరు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమీపంలో నీటి శుద్ధి కేంద్రాలు ఉంటే.. నిత్యం తెచ్చుకోవడానికి వీలుంటుంది. కానీ, తిమ్మాపూర్ మండలం సుభాష్నగర్ గ్రామస్తులు కిలోమీటరు దూరం నుంచి తాగునీరు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సర్పంచ్ అంజయ్య తిమ్మాపూర్లోని జ్యోతిష్మతి విద్యా సంస్థల సహకారంతో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయగా గ్రామస్తులకు తాగునీటి కష్టాలు తీరాయి.
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహణ
తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి అనుబంధ గ్రామాలుగా చర్లపల్లి, సుభాష్నగర్ ఉన్నాయి. సుభాష్నగర్ గ్రామస్తులు తాగునీటి కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న రామకృష్ణకాలనీ గ్రామపంచాయతీ నీటిశుద్ధి కేంద్రానికి వెళ్లాలి. దీంతో ద్విచక్ర వాహనాలు ఉన్న వారు వెళ్లి డబ్బాల్లో నీళ్లు తెచ్చుకునేవారు. వాహనాలు లేని వారు బోరు నీళ్లు, లేకపోతే ప్రైవేట్ ప్లాంట్లలో ఎక్కువ డబ్బులు వెచ్చించి తాగునీటిని కొనుక్కునేవారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన మీసాల అంజయ్య గ్రామస్తులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు దృష్టికి తీసుకెళ్లారు. సాగర్రావు సహకారంతో 2019 మేలో సుభాష్నగర్లో రాజీవ్ రహదారి పక్కన బోర్, షెడ్డు వేసి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బందిని ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. సుభాష్నగర్తో పాటు తిమ్మాపూర్ గ్రామస్తులు సైతం వచ్చి తాగునీటిని తీసుకెళ్తున్నారు. నీటిశుద్ధి కేంద్రంలో నిత్యం రెండు వందల డబ్బాల నీళ్లు తీసుకెళ్తుండగా, ప్లాంట్ నిర్వహణ కోసం 20 లీటర్ల క్యాన్కు రూ.5 తీసుకుంటున్నారు. నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీర్చిన సాగర్రావు, సర్పంచ్ మీసాల అంజయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.