భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20కి స్టేడియం ఫుల్!

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఈ నెల 8వ తేదీన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆఖరి టీ20కి పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్యపై విధించిన ఆంక్షలను డిసెంబర్ 7 నుంచి న్యూ సౌత్వేల్స్ ప్రభుత్వం తొలగించాలని భావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేస్తే సిడ్నీ క్రికెట్ మైదానం అభిమానులతో నిండిపోనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ శుక్రవారం నుంచి ఆరంభంకానుంది.
కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 50 శాతం ప్రేక్షకుల్ని మాత్రమే స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ అభిమానుల సందడి మధ్య అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది. న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాధినేత గ్లాడిస్ బెరెజిక్లియన్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి బహిరంగ స్టేడియాలు 100% సామర్థ్యానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గత మూడు వారాల నుంచి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదు.