హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదిక జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ కుస్నూర్ శివకుమార్ స్వర్ణ పతకంతో మెరిశాడు. పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లై ఎస్-9 రేసును శివ 1:25:34 సెకన్లలో ముగించి పసిడిని ఖాతాలో వేసుకున్నాడు. పోలియోతో కుడికాలు పనిచేయకపోయినా.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లని శివ రాష్ట్రం గర్వపడే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన శివ నిరుపేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు.