అంబర్పేట, మార్చి 29 బాగ్అంబర్పేట సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ(సీఈకాలనీ)లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తున్నది. ఈ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో దొంగతనాలు, స్నాచింగ్లు బందయ్యాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాలనీ వాసులు నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల నేరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా ప్రశాంతత ఉందని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోకి వచ్చే బాగ్అంబర్పేట డివిజన్ సీఈ కాలనీలో మూడున్నరేండ్ల క్రితం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని అప్పటి దివంగత హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. కాలనీ పార్కులో వీటికోసం ఒక గదిని కేటాయించారు. కాలనీ మొత్తానికి సంబంధించిన సీసీ కెమెరాలను అనుసంధానిస్తూ ఈ గదిలో పెట్టారు.
ఈ కెమెరాల నిర్వహణను కాలనీ అసోసియేషన్ భరిస్తున్నది. వీటి ఏర్పాటుతో కాలనీ వాసుల్లో భయాందోళన తొలగిపోయింది. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉండటంతో ఇటీవల కొందరు దొంగలను కూడా పోలీసులు పట్టుకొన్నారు. బైక్ దొంగలతో పాటు స్నాచింగ్కు పాల్పడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుపు తెంపుకొని పారిపోరిన వ్యక్తిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను కూడా ఈ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించి అతని నుంచి ఎనిమిది బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ కాలనీలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం మంచి సత్ఫలితాలను ఇస్తున్నదని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే తమకు కెమెరాల నిర్వహణ కష్టంగా ఉందని, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో తగిన సహకారం అందించాలని కోరారు.