సిద్దిపేట టౌన్, మే 22 :
కరోనాతో చనిపోతే చివరి చూపునకు నోచుకోని రోజులు ఇవి. నా.. అన్న వారు ఎందరూ ఉన్నా.. దగ్గరకు వెళ్లని విపత్కర పరిస్థితులు. అలాంటిది కులం, మతం, కనీసం పరిచయం కూడా కాదు కరోనాతో చనిపోయే వారికి మేమున్నామంటున్నారు. చివరి మజిలీ వారి ఆత్మకు శాంతి చేకూరేలా అంత్యక్రియలు చేపడుతూ గొప్ప మనసున్న మానవమూర్తులు ఈ ముస్లిం యువకులు. దవాఖానలో కరోనాతో చనిపోయే వారి శవాలను తీసుకెళ్లలేని పరిస్థితులు చూసి చలించిపోయారు. వారు మానవత్వంతో కరోనాతో చనిపోయే వారికి అంత్యక్రియలు స్వచ్ఛందంగా చేపట్టాలని తలచారు. నాటి నుంచి ఈ ముస్లిం యువకులు మానవీయ సేవలను కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట ఇస్లాంపుర, సాజిద్పురాలకు చెందిన పాతికేళ్లు నిండని సోహెల్, హజీ, ఫర్వేద్, అబ్బాస్, అతిక్లు డ్రైవర్లుగా పనిచేసే నిరుపేద ముస్లింలు. కరోనా కష్టకాలంలో తమవంతు ఏదైనా చేయాలని సంకల్పించి గొప్ప యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. కరోనాతో చనిపోయే వారి అంత్యక్రియలను స్వచ్ఛందంగా చేపడుతూ స్ఫూర్తిదాయక సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు కిష్టాపురం, గుండారం, సిద్దిపేట గాంధీనగర్, కోటిలింగాల కాలనీ, నర్సపురంలలో కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేపడుతూ గొప్ప మనస్సును చాటుతున్నారు.
ఆఖరి సఫర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు..
నయాపైసా ఖర్చులేకుండా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు స్వచ్ఛందంగా చేపడుతున్న ముస్లిం యువకులు అందుకు గాను ప్రత్యేకంగా ఆఖరి సఫర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గ్రూప్లో వచ్చిన సమాచారం, 9160410312, 9704886826 నంబర్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా, సమాచారం తెలిసినా వీరు స్వచ్ఛంధంగా అక్కడికి చేరుకొని అంత్యక్రియలను చేపడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ముస్లిం యువకులను పలువురు అభినందిస్తున్నారు.