క్వార్టర్స్లో ఓడిన స్విస్ దిగ్గజం.. హుర్కజ్ సంచలన విజయం.. సెమీస్ చేరిన జొకో, షపొవలోవ్ వింబుల్డన్లో సంచలనం నమోదైంది. పచ్చిక కోర్టు రారాజు, ఎనిమిదిసార్లు చాంపియన్ రోజర్ ఫెదరర్ ఘోర పరాభవం చవిచూశాడు. తొలిసారి గ్రాండ్స్లామ్ క్వార్టర్స్ చేరిన పొలాండ్ యువ ప్లేయర్ హుబర్ట్ హుర్కజ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తాను ఓ వెలుగు వెలిగిన సెంటర్ కోర్టు నుంచి ఫెడ్ నిరాశగా వెనుదిరిగాడు. మరోవైపు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ పదోసారి వింబుల్డన్ సెమీస్ చేరగా.. ఉత్కంఠ విజయం సాధించిన షపొవలోవ్తో అతడు తలపడనున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్లు సానియా మీర్జా – రోహన్ బోపన్న అద్భుతంగా పోరాడినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయారు.
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ చరిత్రలో అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెదరర్కు నిరాశ ఎదురైంది. టోర్నీ క్వార్టర్ ఫైనల్స్లోనే స్విస్ దిగ్గజం కనీస పోరాటం కనబరచలేక ఘోర ఓటమి చవిచూశాడు. బుధవారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్లో 20 గ్రాండ్ టైటిళ్ల విజేత ఫెదరర్ 3-6, 6-7 (4/7), 0-6 తేడాతో 14వ సీడ్ హుబర్ట్ హుర్కజ్ (పొలాండ్) చేతిలో గంటా 48 నిమిషాల్లోనే పరాజయం పాలయ్యాడు. తొలి రెండుసెట్లు హోరాహోరీగా పోరాడిన రోజర్.. చివరి సెట్లో పూర్తిగా తేలిపోయాడు. మ్యాచ్ మొత్తం 31 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. హుర్కజ్ 10 ఏస్లు 36 విన్నర్లు సాధించగా.. ఫెదరర్ 5 ఏస్లు, 34 విన్నర్లు బాదాడు. గాయం కారణంగా ఇటీవల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఫెదరర్కు ఇదే చివరి వింబుల్డన్ కావొచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా మరో క్వార్టర్స్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-4 తేడాతో మార్టోన్ ఫక్సోవిక్ పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో 10వ సీడ్ డెనిస్ షపోవలోవ్(కెనడా) 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో కరెన్ కచనోవ్పై ఉత్కంఠ పోరులో గెలిచాడు.
మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్లు సానియా మీర్జా-రోహన్ బోపన్న చివరి వరకు పోరాడి ఓడారు. సోమవారం వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్ బుధవారం కొనసాగగా.. సానియా ద్వయం 3-6, 6-3, 9-11 తేడాతో 14వ సీడ్ జోడీ ఆండ్రెజా క్లెపాక్, జులెన్ రోజర్ చేతిలో ఓటమిపాలైంది.
గాయం వల్ల గతేడాది ఆటకు పూర్తిగా దూరమైన 39 ఏండ్ల ఫెదరర్.. గతంలా ఫిట్నెస్ను సాధించలేకపోయాడు. వయసు పెరుగడం వల్ల కూడా మునపటిలా దూకుడు కనబరచలేకపోయాడు. అయినా పట్టువిడవకుండా స్విస్ దిగ్గజం క్వార్టర్స్ వరకు చేరాడు. అయితే టోర్నీకి ముందే ఫెదరర్కు ఇదే చివరి వింబుల్డన్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనకు ఎంతో ఇష్టమైన ఈ టోర్నీ ఆడాకే కెరీర్పై నిర్ణయం తీసుకుంటాడన్న అంచనాలు వెలువడ్డాయి. అలాగే క్వార్టర్స్లో ఓడాక అభిమానులు కూడా ఫెదరర్కు నిలబడి థాంక్యూ అన్నట్టు అభినందనలు తెలిపారు.