లండన్: భారత్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. టీమ్ఇండియా లాంటి పటిష్ట ప్రత్యర్థితో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మాల్దీవుల్లో క్వారంటైన్ ముగించుకుని ఇంగ్లండ్ చేరుకున్న కేన్.. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు పలు అంశాలపై మాట్లాడిన వీడియోను మంగళవారం ఐసీసీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న నేపథ్యంలో విలియమ్సన్ మాట్లాడుతూ ‘టీమ్ఇండియాతో సవాలుకు సిద్ధంగా ఉన్నాం.
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్తో పోరు అంటే ఎప్పుడైనా ఆసక్తే. వారితో ఆడేందుకు మేము ఆతృతగా ఎదురుచూస్తుంటాం. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన డబ్ల్యూటీసీతో జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. ప్రతీ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ జట్లు పోరాట పటిమ కనబరిచాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్ పోరు హోరాహోరీగా సాగితే, పాకిస్థాన్, కివీస్ సిరీస్ కూడా నువ్వానేనా అన్న రీతిలో జరిగింది. ఫలితం కోసం జట్లు పోరాడినా వైనం ఆకట్టుకుంది. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది’ అని అన్నాడు. మరోవైపు కివీస్ స్పీడ్స్టర్ నీల్ వాగ్నర్ స్పందిస్తూ ‘ఇంగ్లండ్ పిచ్లపై భారత బౌలర్లు మెరుగ్గా రాణించే చాన్స్ ఉంది.
స్వింగ్కు అనుకూలించే పిచ్లపై వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు వాళ్లు చెలరేగితే బ్యాట్స్మెన్కు కష్టాలు తప్పవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే సత్తా ఉన్న బౌలర్లు టీమ్ఇండియా సొంతం. కానీ సూర్యుడు ఉండి వాతావరణం పొడిగా ఉంటే అప్పుడు వికెట్ ఫ్లాట్గా మారి బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. ఇంగ్లండ్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లు ప్రణాళిక రచించుకుంటే సానుకూల ఫలితం రాబట్టవచ్చు’ అని అన్నాడు.
‘ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో దేశం తరఫున ఆడటం ఏ ప్లేయర్కైనా గొప్ప అనుభూతి. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తుది జట్టులో ఉంటే పరిస్థితులకు తగ్గట్లు రాణించేందుకు సిద్ధంగా ఉంటాను’ అని టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి అన్నాడు. కౌంటీ సీజన్లో భాగంగా ప్రస్తుతం వార్విక్షైర్ తరఫున విహారి ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఇంగ్లండ్తో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.
డబ్యూటీసీ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లనున్న విరాట్కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్లేయర్లకు ఇంగ్లండ్లో రెండో డోసు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల 2న ఇంగ్లండ్కు వెళ్లనున్న భారత్ మూడు నెలల పాటు అక్కడ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో యూకే వైద్య శాఖ సహకారంతో బీసీసీఐ వ్యాక్సిన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు ముంబైలో బయో బబుల్లోకి చేరే ముందు ప్లేయర్లు మూడు సార్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.