లండన్: 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టామన్న ఆనందం ఇంగ్లండ్కు ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం జరిగిన యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో ఆ టీమ్కు ఓటమి తప్పలేదు. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉండటంతో పెనాల్టీస్ తప్పలేదు. ఇందులో ఇటలీ 3-2తో విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ తరఫున ఆ మూడు పెనాల్టీలను మిస్ చేసిన మార్కస్ రాష్ఫోర్డ్, జేడన్ సాంచో, బుకాయో సాకాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది.
ఈ సమ్మర్లో ఇంగ్లండ్ జెర్సీ కోసం తమ సర్వస్వం ధారపోసిన మా ప్లేయర్స్ కొందరిపై వివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అని అక్కడి అసోసియేషన్ ట్వీట్ చేసింది. తాము ప్లేయర్స్కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఇలాంటి అన్ని వివక్షపూరిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఆన్లైన్లో ప్లేయర్స్ను ట్రోల్ చేస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.